News

ప్రదాని మోదీ సభకు వెళ్లకుండా బందీలుగా ఆదివాసీలు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులు వివిధ గ్రామాలకు చెందిన వెయ్యి మంది ఆదివాసీలను శుక్రవారం రాత్రి బందీలుగా పట్టుకున్నారు. శనివారం రాత్రి వారందరినీ విడుదల చేశారు. అయితే, ప్రజా కోర్టు నిర్వహించి ఒక వ్యక్తిని మాత్రం కొట్టి చంపేశారు. దంతెవాడలో ప్రధాని సభకు వెళ్లేందుకు ఆదివాసీలు పెద్దఎత్తున సుక్మా జిల్లా నుంచి కూడా తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న బ్రిడ్జికి సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న సదారామ్‌ నాగ్‌ అనే గిరిజనుడిని ప్రజా కోర్టులోనే కొట్టి చంపేశారని సుక్మా ఎస్పీ డి.శ్రవణ్‌ తెలిపారు. కాగా, మోదీ పర్యటనను బాయ్‌కాట్‌ చేయాలంటూ శుక్ర, శనివారాల్లో దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బస్తర్‌లోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే ట్రాకులను ధ్వంసం చేసి ఫిష్‌ ప్లేట్లను తొలగించారు. రైళ్లతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలో బంద్‌ విజయవంతమైంది.